Saturday, September 7, 2013

National Current affairs on August 2013

Taken From Eenadu prathibha peper

ఆగస్టు - 2013 జాతీయం

ఆగస్టు - 1
¤ పది నెలల క్రితం బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించినప్పటికీ ఒక్క విదేశీ కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో, కేంద్రప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. అనుమతించినప్పుడు పెట్టిన ప్రధాన నిబంధనలకు సడలింపు ఇచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితుల పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు¤ బహుళ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో విదేశీ కంపెనీలు ప్రవేశించడానికి వీలుగా నిబంధనల సరళీకరణ, కొనుగోలు చేసే సరకులో 30% తప్పనిసరిగా స్థానికంగా కొనుగోలు చేయాలనే నిబంధన సడలింపు, వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఒకసారి స్థానికంగా 30 శాతం సరకు కొనుగోలు చేస్తే సరిపోతుంది.¤ 10 లక్షలకంటే తక్కువ జనాభా కలిగిన పట్టణాల్లో కూడా బహుళ బ్రాండ్ స్టోర్‌లను ఏర్పాటు చేసుకోవడానికి కంపెనీలను రాష్ట్రాలు అనుమతించవచ్చు.¤ రిటైల్ రంగంలోని బ్యాక్-ఎండ్ మౌలిక సదుపాయల్లో వ్యాపారం ప్రారంభించేటప్పుడు 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితే సరిపోతుంది. ఆ తర్వాత అవసరమైతేనే పెట్టుబడులు పెట్టే వెసులుబాటు కల్పించారు.¤ టెలికాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితి 74% నుంచి 100 శాతానికి పెంపు. 49% వరకూ అనుమతులు లేకుండానే ఆటోమేటిక్‌గా పెట్టొచ్చు. అంతకు మించిన వాటాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతి పొందాలి.¤ రక్షణ ఉత్పత్తుల రంగంలో ఎఫ్‌డీఐలు 26 శాతానికే పరిమితం. అత్యాధునిక పరిజ్ఞానంతో తయారయ్యే ఉత్పత్తుల విషయంలో భద్రతపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ పరిశీలించి, అధిక పెట్టుబడులను అనుమతిస్తుంది.¤ ఏక బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో 100% ఎఫ్‌డీఐలకు అనుమతి. ఇందులో 49 శాతాన్ని అటోమేటిక్‌గా పెట్టొచ్చు. అంతకుమించిన వాటా పొందాలంటే ఎఫ్ఐపీబీ అంగీకరించాలి.¤ ఇప్పటివరకు పెట్రోలియం రిఫైనరీ రంగంలో 49% వరకూ విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు. ఇక అనుమతులు లేకుండానే 49% వరకూ విదేశీ పెట్టుబడులను పెట్టొచ్చు.¤ పవర్ ఎక్స్ఛేంజీల్లో అనుమతుల అవసరం లేకుండానే 49% వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అంగీకారం.¤ ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీల్లో ఎఫ్‌డీఐల పరిమితి 100 శాతానికి పెంపు. ఇప్పటివరకూ ఇది 74% గా ఉంది. 49% పెట్టుబడుల వరకూ అనుమతుల అవసరం లేదు.¤ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థల్లో ఎఫ్‌డీఐల పరిమితి 74 శాతానికి పెంపు.¤ అనుమతులు లేకుండా స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీల్లో 49% వరకూ ఎఫ్‌డీఐలు పెట్టొచ్చు.¤ కొరియర్ సేవల్లో ముందస్తు అనుమతులు లేకుండా 100% వరకూ ఎఫ్‌డీఐలకు ఆమోదం.¤ జులై 16న ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల బృందం తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.¤ సమాచార హక్కు చట్టం పరిధి నుంచి రాజకీయ పార్టీలను మినహాయిస్తూ చట్ట సవరణ చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.         » కాంగ్రెస్, భాజపా, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, బిఎస్‌పీ లను సమాచార హక్కు చట్టం కిందికి తెస్తూ కేంద్ర సమాచార సంఘం ఆదేశాలు జారీ చేసిన రెండు నెలల తర్వాత కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.         » రాజకీయ పార్టీలు ప్రభుత్వ సంస్థలు కావని ప్రకటిస్తూ సవరణ చేయనున్నారు. ప్రతిపాదిత సవరణలో సమాచార హక్కు చట్టం రెండో సెక్షన్ కింద ప్రభుత్వ సంస్థ నిర్వచనాన్ని 'ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద నమోదైన ఎలాంటి రాజకీయ పార్టీనీ ఇందులో చేర్చరాదు' అని స్పష్టం చేయనున్నారు.         » ప్రజా వేగుల రక్షణ బిల్లు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.         » రైలు ఛార్జీల హేతుబద్ధత కోసం రైల్ టారిఫ్ అథారిటీ (ఆర్‌టీఏ) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ, అధికారాల వంటి వివిధ అంశాలపై వివరణలు కోరుతూ తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఆగస్టు - 2
¤ తమిళనాడు తిరుచ్చి సమీపంలోని తిరుమాయంలో బీహెచ్ఈఎల్ నెలకొల్పిన రెండు విద్యుదుత్పత్తి పైపింగ్ యూనిట్లను ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.         » దేశంలో తీవ్రమవుతున్న విద్యుత్తు సమస్యను ఎదుర్కునేందుకు విద్యుదుత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళికలో పునరుత్పాదక విద్యుత్తును కలుపుకొని అదనంగా లక్ష మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని ప్రకటించారు.¤ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భాగీరథి నది ఒడ్డున ఉన్న ప్రఖ్యాత మణికర్ణిక అనే ఆలయం ఎడతెరపిలేని వర్షాల కారణంగా భాగీరథి నది ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది.
ఆగస్టు - 4
¤ ఏళ్ల తరబడి ఊగిసలాట తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని నదులకూ కలిపి అంతర్రాష్ట్ర నదీ వివాదాల ట్రైబ్యునల్ ఒకటి ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చింది.         » ప్రస్తుతం దేశంలోని అయిదు నదీ పరీవాహక ప్రాంతాల్లో రాష్ట్రాల మధ్య జలాల పంపిణీని నిర్ణయించేందుకు ట్రైబ్యునళ్లు వేసేందుకు అనుమతి ఉంది. వాటిస్థానంలో ఇక శాశ్వత వ్యవస్థ రానుంది. దీనికి సంబంధించి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం - 1956 ను సవరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ కేబినెట్ నోట్‌ను తయారు చేసింది. నోట్ ప్రకారం అయిదు ట్రైబ్యునళ్లు రద్దవుతాయి.¤ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇటీవల ప్రత్యేక తెలంగాణాకు అనుకూల నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ డిమాండ్లన్నిటినీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించే పక్షంలో దేశవ్యాప్తంగా మరో 20కి పైగా కొత్తరాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది.         » ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి బీఎస్పీ ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదించింది. ఈ ఒక్కచోట నుంచి మినహా మరే రాష్ట్రం నుంచి కూడా అధికారికంగా సిఫార్సు గానీ, ప్రతిపాదన గానీ రాకపోయినా, ప్రత్యేక రాష్ట్రాల కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయని కేంద్ర హోమంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి.         » ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒక జాతీయ రాజధాని ప్రాంతం (ఢిల్లీ) ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించడానికి మార్గం సుగమమైంది.రాష్ట్రాల వారీగా వినిపిస్తున్న ప్రత్యేక డిమాండ్లు¤ ఉత్తరప్రదేశ్: అవధ్ ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, పశ్చిమాంచల్ లేదా హరితప్రదేశ్. ఈ నాలుగే కాకుండా యూపీలోని ఆగ్రా, అలీఘడ్ డివిజన్లను, రాజస్థాన్‌లోని భరత్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలను కలిపి 'బ్రజ్ ప్రదేశ్' అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. తూర్పు యూపీలోని కొన్ని ప్రాంతాలను, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని కొన్ని ప్రాంతాలకు కలిపి 'భోజ్‌పూర్' రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ హోంశాఖకు వినతులు వస్తున్నాయి.¤ బీహార్, జార్ఖండ్: ఈ రెండు రాష్ట్రాల్లోని మైథిలీ భాషను మాట్లాడే ప్రజల నివాస ప్రాంతాలతో కూడిన 'మిథిలాంచల్' ఏర్పాటుకు అభ్యర్థనలు.¤ అసోం, నాగాలాండ్: ఈశాన్య భారత్‌లోని దిమాసా నివాసిత ప్రాంతాలన్నిటినీ కలిపి 'దిమరాజీ' లేదా 'దిమాసా' రాష్ట్రం కావాలని డిమాండ్.¤ తమిళనాడు, కర్ణాటక, కేరళ: ఈ మూడు రాష్ట్రాల హద్దుల్లో ఉన్న ప్రాంతాలను కలిపి 'కొంగునాడు'గా ప్రకటించాలనే అభ్యర్థనలున్నాయి.¤ కర్ణాటక, కేరళ: 'తుళునాడు' రాష్ట్రం కోసం డిమాండ్¤ కర్ణాటక: కూర్గ్ ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక 'కూర్గ్' రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్.¤ ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్: మూడు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలతో 'కోసల్' రాష్ట్ర ఏర్పాటుకు వినతులు.¤ మణిపూర్: కుకి గిరిజన ఆవాస ప్రాంతాలతో 'కుకీల్యాండ్'.¤ మేఘాలయ: గారో ప్రాంతాలన్నీ కలిపి 'గారోల్యాండ్'.¤ మహారాష్ట్ర: 'విదర్భ' రాష్ట్రం కోసం డిమాండ్.¤ గుజరాత్: 'సౌరాష్ట్ర' రాష్ట్రం కావాలని డిమాండ్.¤ మహారాష్ట్ర, గోవా: కొంకణి భాష మాట్లాడే వారితో 'కొంకణ' రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్.¤ పశ్చిమ బెంగాల్: గూర్ఖాల్యాండ్ (డార్జిలింగ్ + గూర్ఖా), కామత్‌పురా (కూచ్ బెహార్, జల్పాయ్‌గురి తదితర జిల్లాలతో) ఏర్పాటు చేయాలని వినతులు.¤ అసోం: పశ్చిమ అసోంలోని బోడోల ప్రాబల్య ప్రాంతాలన్నిటినీ కలిపి 'బోడోల్యాండ్' రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పాటు 'కర్బి అంగ్‌లాంగ్' (కర్బి గిరిజనుల నివాస ప్రాంతాలన్నింటినీ కలిపి) రాష్ట్ర అభ్యర్థన కేంద్రం వద్ద ఆపరిష్కృతంగా ఉంది.¤ ఇవే కాకుండా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి 'తూర్పు నాగాల్యాండ్‌'గా ప్రత్యేక రాష్ట్రంగా, జమ్ము కాశ్మీర్‌లోని 'లడఖ్‌'ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్లు ఉన్నాయి.
ఆగస్టు - 5
¤ వికలాంగులకు ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదిత బిల్లును ప్రభుత్వం ఖరారు చేసింది.         » ప్రస్తుతం వికలాంగుల చట్టం - 1995 ప్రకారం వికలాంగులు మూడు శాతం రిజర్వేషన్ పొందుతున్నారు.¤ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.         » షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు 2012 ను సాంఘిక సంక్షేమ మంత్రి కుమారి సెల్జా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్తగా కొన్ని కులాలను ఎస్సీలుగా పరిగణించాలంటూ మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను ఈ బిల్లులో పొందుపరిచారు.¤ వన్యప్రాణులకు మరింత రక్షణ కల్పించే ఉద్దేశంతో రూపొందించిన సవరణ బిల్లును పర్యావరణ శాఖ మంత్రి జయంతీ నటరాజన్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.         » వన్యప్రాణులను చంపినా, వాటి మాంసం వినియోగించినా, ఇతరత్రా వ్యాపారాలు చేసినా, కొత్తచట్టం ప్రకారం కఠినశిక్ష అనుభవించక తప్పదు. నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అదే నేరం మరోసారి చేస్తే ఏడేళ్ల శిక్షతోపాటు రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆగస్టు - 6
¤ కేంద్రప్రభుత్వం జాతీయ ఔషధ ధరలపై రూపొందించిన కొత్త విధానం చెల్లుబాటు అంశంపై న్యాయసమీక్ష జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.         » కొత్త ఔషధ విధానం, ప్రభుత్వం ఖరారు చేసిన ధరలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 'అఖిల భారత డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.¤ పాఠ్యపుస్తకాల్లో భగవద్గీత బోధనల చేర్పునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.         » 2013-14లో ఉర్దూ మాధ్యమ పాఠ్యప్రణాళికలో 'గీతా అంశాలు' చేర్చడంపై ప్రతిపక్షాల నుంచి చౌహాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది.¤ దేశంలో పాల ఉత్పత్తుల ఎగుమతులు గతేడాది కొత్త రికార్డులు నమోదు చేశాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా రూ. 1,412.10 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను భారత డెయిరీలు విదేశాలకు విక్రయించాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 388 శాతం అధికంగా ఎగుమతులు జరగడం విశేషం.         » అన్ని రకాల పాల ఉత్పత్తులపై గతేడాది నిషేధం ఎత్తేయడంతో చివరి ఆరు నెలల్లో పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం వరకూ ఎగుమతులపై నిషేధం కారణంగా దేశంలో పాలపొడి నిల్వలు బాగా పెరిగిపోయాయి. ఇదే తరుణంలో గత శీతాకాలంలో పాల దిగుబడి మరింత పెరగడంతో కేంద్రం దిగివచ్చి, నిషేధం తొలగించింది. దేశం నుంచి మొత్తం 87,824.20 టన్నులపాల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశారు. ఇది ఓ రికార్డు.         » గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ గతేడాది ఎగుమతుల్లో ఏకంగా 45 శాతం వృద్ధిరేటును సాధించింది. ఈ సంస్థ రూ.140 కోట్ల విలువైన ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో విక్రయించడం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.         » భారత పాల ఉత్పత్తులను అధికంగా కొనడంలో అరబ్ దేశాలే అగ్రస్థానంలో ఉన్నాయి. ఐరోపా, అమెరికా దేశాలకు పెద్దగా ఎగుమతులు వెళ్లడం లేదు.
ఆగస్టు - 7
¤ యుపీఏ ప్రభుత్వ కలల పథకం 'ఆహార భద్రత బిల్లు'ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు.         » ఈ బిల్లుపై గతంలో యూపీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును ఉపసంహరించుకుని, ఆహారశాఖ మంత్రి కె.వి. థామస్ ఈ ముసాయిదాను లోక్‌సభ ముందుంచారు.         » ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి.¤ పార్లమెంటు, శాసనసభ స్థానాల పేర్లు మార్చేందుకు ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక పరిమిత అధికారాలను కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.         » ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే పార్లమెంటు, శాసనసభల స్థానాల పేర్లు మార్చే అధికారం ఈసీకి లభిస్తుంది. అయితే ఆ స్థానాల్లో గడచిన 10 ఏళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి ఏదైనా ఓ కులాన్ని తొలగించడం, లేదా జాబితాలో జోడించడం లాంటివి జరిగి ఉండాలి.          » ఈ ఏడాది రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.¤ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వారు తమ స్వీయ రక్షణ కోసం ఉపయోగించుకొనేందుకు వీలుగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) కారపు స్ప్రే రూపొందించింది.         » ఇందుకోసం అసోంలో పండించే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చిని వినియోగించారు. ఈ సాధనానికి 'కాప్సి స్ప్రే' అని పేరు పెట్టారు.¤ దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఉన్న కేసుల వివరాల సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు ఉపయోగపడే 'జాతీయ న్యాయ సంబంధ గణాంక తంత్రీ జాలం' (నేషనల్ జ్యూడిషియల్ డేటా గ్రిడ్ - ఎన్‌జేడీజీ)ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం న్యూఢిల్లీలోప్రారంభించారు.         » ఎన్‌జేడీజీ ద్వారా కోర్టుల్లో నమోదవుతున్న కేసులు, పెండింగ్‌లో ఉన్న వాటి సమాచారం, తదితరాలను తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్www.ecourts.nic.in లో ఈ వివరాలన్నీ లభ్యమౌతాయి.
ఆగస్టు - 9
¤ ప్రవాస భారతీయ పెళ్లిళ్లు, అల్లుళ్ల పేరిట జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది.         » ఎన్ఆర్ఐల పేరిట జరిగే వివాహాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయనీ, పెద్ద ఎత్తున మహిళలు మోసపోతున్నారనీ ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. వాటిని అరికట్టే ఉద్దేశంతో ప్రవాస భారతీయ పార్లమెంటరీ స్థాయీసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఇటీవల పలు సిఫార్సులు చేసింది. వీటిని అమలు చేయడానికి కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాల సహకారాన్నీ కోరింది.         » ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల పేరిట జరిగే మోసాల తీరు తెన్నులపై అన్ని ఉన్నత పాఠశాలల్లో, మహిళా కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, యువతులను చైతన్య పరచాలి.         » ఆంగ్లం, హిందీతో పాటు తెలుగు, మలయాళం, గుజరాతీ, పంజాబీ, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లోనూ కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలి. వీటిని పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయాలు, సేవా కేంద్రాల్లో యువతులకు అందజేయాలి.         » ప్రతి ఎన్ఆర్ఐ వివాహాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో నమోదు చేయించాలి. ఈ సమయంలో వధూవరులు విధిగా హాజరు కావాలి. నమోదు పత్రంలో పాస్‌పోర్టు నెంబర్, సామాజిక భద్రత సంఖ్య, గుర్తింపు కార్డు వివరాలు ఉండాలి. ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న వారి వివరాలను జాతీయ మహిళా కమిషన్ వెబ్‌సైట్లలో ప్రదర్శించాలి.¤ 2013 జులైలో స్పెయిన్‌లో జరిగిన గాస్టెయిజ్ ఫుట్‌బాల్ పోటీల్లో 'యువ ఇండియా' పేరుతో పోటీ పడి అంతర్జాతీయ అండర్ 14 స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన జార్ఖండ్ నిరుపేద గ్రామీణ విద్యార్థినుల జట్టుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేష్ రూ.10 లక్షలు ఎంపీ ల్యాడ్స్ కింద కేటాయించారు.         » ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పది జట్లు పాల్గొన్నాయి.¤ కూడంకుళం అణు విద్యుత్తు కేంద్రం నుంచి విద్యుత్తు కేటాయింపుల్లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ను మినహాయించి మిగిలిన రాష్ట్రాలకు విద్యుత్తును కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.         » కూడంకుళం నుంచి ఉత్పత్తయ్యే రెండువేల మెగావాట్లలో అత్యధికంగా తమిళనాడుకు ఇచ్చారు. ఆ రాష్ట్రానికి 925 మెగావాట్ల విద్యుత్తు కేటాయించాల్సి ఉండగా, అదనంగా మరో వంద మెగావాట్లు కేటాయించారు. దీంతో కూడంకుళం నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తులో సగానికి పైగా తమిళనాడు దక్కించుకున్నట్లయింది. మిగిలిన విద్యుత్తులో కర్ణాటకకు 442 మెగావాట్లు, కేరళకు 266 మెగావాట్లు, పుదుచ్చేరికి 67 మెగావాట్లు కేటాయించారు. మిగిలిన విద్యుత్తును ఎవరికీ కేటాయించకుండా కేంద్రం తనవద్దే అట్టిపెట్టుకుంది.         » 2003-04 కాలంలో కూడంకుళం అణువిద్యుత్తు కేంద్రం నిర్మాణంపై సందేహాలు నెలకొనడంతో విద్యుత్తు కేటాయింపులపై చర్చించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్తు అవసరాల నేపథ్యంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ గా పనిచేసిన సమారియా హయాంలో ఏడాది క్రితం రాష్ట్రానికి విద్యుత్తు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినా, ఇప్పుడు ఫలితం లేకుండా పోయింది.
ఆగస్టు - 11
¤ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల అనంతరం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేశారు.         » జమ్మూ ప్రాంతంలోని అయిదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.¤ జాతీయ రహదారులపై ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు ఉచిత వైద్య సేవలను అందించే లక్ష్యంతో 'జీవన్ బచావో' పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.         » దీన్ని ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై ప్రారంభించారు.         » ప్రమాదం జరిగిన తర్వాత సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలు అధికంగా ఉంటున్నాయనీ, క్షతగాత్రుల వద్ద సమయానికి డబ్బుల్లేకపోవడం వల్ల కూడా వైద్యం సక్రమంగా అందడం లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.         » ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలనూ అధిగమించేలా 'జీవన్ బచావో' పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.         » జీవన్ బచావో టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి, ప్రమాద వివరాలు తెలియజేస్తే సమీపంలోని సేవాదళం అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తుంది. 48 గంటలపాటు బాధితులకు వైద్యం అందిస్తారు. ఒక్కో క్షతగాత్రుడిపై రూ.30 వేల వరకు ప్రభుత్వం వ్యయం చేస్తుంది.         » ఈ పథకాన్ని మన రాష్ట్రం పరిధిలోనూ ప్రారంభించేందుకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ కసరత్తు చేస్తోంది.¤ గుజరాత్ గాంధీనగర్‌లోని భారత సాంకేతిక విద్యాసంస్థ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు.         » అణు ఇంధన సంఘం మాజీ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.¤ సుబ్రహ్మణ్య స్వామి నేతృత్వంలోని జనతాపార్టీ భాజపాలో విలీనమైంది. భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో సుబ్రహ్మణ్య స్వామి విలీన ప్రకటన చేశారు.¤ ఢిల్లీలో యమునా నది ఒడ్డున గాంధీ మహాత్ముడి సమాధి రాజ్‌ఘాట్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతగా సాయుధ సిబ్బందిని నియమించింది.         » ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉన్న రాజ్‌ఘాట్‌కు సమీపంలోని శక్తిస్థల్ (ఇందిరాగాంధీ సమాధి), వీర్‌భూమి (రాజీవ్‌గాంధీ సమాధి), విజయ్‌స్థల్ (లాల్ బహదూర్ శాస్త్రి సమాధి) సహా తొమ్మిదిమంది ప్రముఖుల సమాధులకు 2004 నుంచి ప్రభుత్వం సాయుధ రక్షణ ఏర్పాటు చేసింది.         » గాంధీ అహింసను బలంగా నమ్మిన వ్యక్తి అయిన నేపథ్యంలో రాజ్‌ఘాట్‌కు భద్రత కల్పించే అంశంపై ఇన్నేళ్లుగా మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. అయితే నిఘా వర్గాల సమాచారం మేరకు 24 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని రాజ్‌ఘాట్ వద్ద నియమించింది. గేటు వద్ద ఉండే సిబ్బంది మాత్రమే ఆయుధాలు కలిగి ఉంటారు. సమాధి వద్ద భద్రతగా ఉండేవారు యూనిఫామ్‌లో ఉంటారు.¤ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రజల నుంచి నిధులు సమీకరించి, ఆ తర్వాత కనిపించకుండా పోయిన కంపెనీలు దేశ వ్యాప్తంగా 77 ఉన్నాయి.         » ఈ విధంగా నిధులను సేకరించి మాయమైపోయిన కంపెనీల జాబితాలో గుజరాత్ మొదటిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గుజరాత్‌లో 26 సంస్థలు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి కంపెనీలు 13 ఉన్నాయి.         » ఈ రాష్ట్రాల తరువాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (9 కంపెనీలు), ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ (అయిదు చొప్పున), ఉత్తరప్రదేశ్, బీహార్ (4), చండీగఢ్, కర్ణాటక (2), పంజాబ్, ఒడిశా (ఒక్కోటి చొప్పున) ఉన్నాయి.
ఆగస్టు - 12
¤ రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొస్తూ, కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది.¤ ఎన్నికల మేనిఫెస్టోల్లో ఉచిత హామీలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు రూపొందించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. అయిదు జాతీయ, 23 ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.         » ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఇవ్వడం తమకున్న విశేషాధికారం అని పలు రాజకీయ పార్టీలు ఉద్ఘాటించాయి. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించాలనుకోవడం సరికాదని స్పష్టం చేశాయి. ఒక్క బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్‌పీ) మినహా మిగిలిన పెద్ద పార్టీలన్నీ కూడా ఈ అంశంలో ఒకేతాటిపై నిలిచాయి.
ఆగస్టు - 13
¤ పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 25 లక్షల మంది నైపుణ్యానికి మెరుగులు దిద్దాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం రూ.2 వేల కోట్లు కేటాయించాలనే ప్రతిపాదనకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.         » వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వక్ఫ్ ఆస్తుల అమ్మకాలు, తనఖా, బహుమతి కింద ఇవ్వడంపై నిషేధం విధించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తులను తనఖా పెట్టి, ఆపై అసాధారణ పరిస్థితుల్లో వాటిని అమ్మేందుకు అవకాశం ఉండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.         » జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్‌యూఆర్ఎం) కింద కొత్తగా సుమారు 10 వేల బస్సులను కొనుగోలు చేసేందుకు, అవసరమైన నిధులను విడుదల చేసేందుకు, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.¤ దేశంలోని వయోవృద్ధుల సంక్షేమంకోసం కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.         » వయో వృద్ధుల కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సంఘం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ కమిటీని వేశారు.         » ఈ కమిటీ వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలను, అవసరమైన కొత్త పథకాలను సూచిస్తుంది.¤ జమ్ము కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో ఘర్షణల నేపథ్యంలో రద్దు చేసిన అమర్‌నాథ్ యాత్రను పునఃప్రారంభించారు.¤ ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విపత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆ రాష్ట్రంలో కొత్తగా జల విద్యుత్ ప్రాజెక్టులపై నిషేధం విధిస్తూ, ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి కలుగుతున్న హానిపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.¤ పరిశుభ్రత విషయంలో రైల్వేలు ప్రమాణాలకు ఆమడ దూరంలో ఉన్నాయని 'కాగ్' అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో యంత్రాలతో పరిశుభ్రం చేయడం, బోగీల్లో సరైన కీటక నివారణ చర్యలు చేపట్టడం వంటి విషయాల్లో రైల్వే బోర్డు మార్గదర్శకాల్ని సక్రమంగా అమలు చేయడం లేదని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 'కాగ్' నివేదిక పేర్కొంది.¤ వివాహ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేస్తూ తీసుకు వచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు - 2012కు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.         » దీని ప్రకారం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. ప్రస్తుతం ఈ చట్టంలో జనన, మరణాల నమోదుకే నిబంధన ఉంది.         » ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్ సభలో ప్రవేశపెట్టారు.¤ విదేశాల్లోని భారతీయ పౌరులకు సంబంధించిన సమస్యల్ని తొలగించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. 'పౌరసత్వ సవరణ బిల్లు 2011' వల్ల 'ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా' అని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బదులుగా, 'ఓవర్సీస్ ఇండియన్ కార్డ్ హోల్డర్స్' అని నమోదు చేసుకోవడానికి మార్గం సుగమమైంది.         » వీరికి ఉద్యోగాలు, ఎన్నికలు, న్యాయమూర్తుల నియామకాలు వంటి విషయాల్లో సమాన హక్కులు వర్తించవు. ఓటరుగానూ నమోదు కాలేరు. శాసనసభలో సభ్యులు కాలేరు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన పౌరులు ఓవర్సీస్ ఇండియన్ కార్డు హోల్డర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుండదు.¤ పోలీసు/ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారు ఎన్నికల నుంచి పోటీ చేయకుండా నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం లేకుండా చేసేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలనే ప్రభుత్వ యోచనకు అఖిలపక్షం నుంచి మద్దతు లభించింది.         » క్రిమినల్ కేసులో రెండున్నరేళ్ల శిక్ష పడిన తేదీ నాటి నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తిస్తుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం లేకుండా చేసేందుకు కూడా రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనకూ మద్దతు లభించింది.         » పార్లమెంట్‌లో వివిధ బిల్లులపై మద్దతు కోరుతూ ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వానికి మద్దతు లభించింది.
ఆగస్టు - 14
¤ 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు.
¤ దేశ వ్యాప్తంగా 56,397 గ్రామాలకు ఇప్పటికీ మొబైల్ సేవలు అందుబాటులో లేవని కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవ్‌రా లోక్‌సభకు వెల్లడించారు. ఈ గ్రామాలకు మొబైల్ సేవలు అందించేందుకు వీలుగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద ఆర్థికసాయం అందిస్తామని ఆయన ప్రకటించారు.¤ దేశం పారామెడికల్, వార్డుబాయ్‌లు తదితర ఆరోగ్య సిబ్బందికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి సేవలు మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా 'జాతీయ వృత్తి ప్రమాణాలను' నిర్దేశించింది.         » ఈ మేరకు 15 రకాల వృత్తులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ఈ వృత్తి ప్రమాణాలను ఆవిష్కరించారు.         » దేశం వైద్యులు, నర్సుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లోని పారామెడికల్ తదితర ఆరోగ్య సిబ్బందికి వారి వృత్తి ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది.¤ మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 51వ జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అగర్‌మాల్వా పేరుతో ఇది ఏర్పాటవుతుంది.         » షాజాపూర్ జిల్లాను విభజించి అగర్‌మాల్వా జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.         » ఆగస్టు 16 నుంచి కొత్త జిల్లా ఉనికిలోకి వస్తుంది. అగర్ పట్టణం ఈ జిల్లా కేంద్రంగా ఉంటుంది. 2,785 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటయ్యే ఈ జిల్లాలో 4.8 లక్షల మంది జనాభా ఉంటారు. డీడీ అగర్వాల్ ఈ జిల్లా తొలి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.         » రాష్ట్రంలో 'ముఖ్యమంత్రి యువ ఇంజినీర్-కాంట్రాక్టర్' అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద యువ ఇంజినీరింగ్ పట్టభద్రులకు సొంతంగా పరిశ్రమ/ వ్యాపారం ప్రారంభించేందుకు రూ.25 లక్షల వరకు ప్రభుత్వం రుణం అందిస్తుంది.         » మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.
¤ సరిహద్దురేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణను అతిక్రమించడాన్ని తప్పుపడుతూ చేసిన తీర్మానాలను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.         » ఈ తీర్మానాలను లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభలో ఛైర్మన్ హమీద్ అన్సారీలు చదివి వినిపించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.         » సరిహద్దు రేఖ వెంబడి కాల్పుల విరమణ పాటించాలని 2003లో రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని, కానీ పాకిస్థాన్ పదేపదే ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తోందని భారత్ విమర్శించింది. గతవారం భారత సైన్యంపై కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ సైన్యం చర్యలను పార్లమెంట్ ఖండించింది.
 
    పార్లమెంట్
¤ దేశ 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 864 పోలీసు, పారామిలటరీ సిబ్బందికి సేవా పతకాలు ప్రకటించారు.         » ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ కేఎల్‌వీఎస్ఎస్‌హెచ్ఎన్‌వీ ప్రసాద్ బాబు (మరణానంతరం) శాంతికాల అత్యున్నత శౌర్యపురస్కారం అశోకచక్రకు ఎంపికయ్యారు. మావోయిస్టుల నిరోధక కార్యక్రమంలో భాగంగా తొమ్మిదిమంది నక్సలైట్ల అగ్రనాయకులను అంతమొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించడంతో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ దళానికి నేతృత్వం వహించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నక్సలైట్ల అగ్రనేతలను హతమార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు.         » మరో ముగ్గురికి శాంతికాల రెండో అత్యున్నత పురస్కారమైన కీర్తిచక్ర ప్రకటించారు. వీరిలో అసోంకు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను మరణానంతరం ఎంపిక చేశారు. మరో 10 మందిని శౌర్యచక్ర పురస్కారానికి రాష్ట్రపతి ఎంపిక చేశారు. నలుగురు జాతీయ భద్రతా దళం సభ్యులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు దక్కాయి.         » దేశంలో నక్సలైట్లపై పోరాడే ప్రముఖ దళం సీఆర్‌పీఎఫ్ అత్యధికంగా 34 శౌర్యపతకాలను గెలుచుకుంది. వీటిలో నాలుగు మరణానంతర పురస్కారాలు. డిప్యూటీ కమాండెంట్ పీఆర్ మిశ్రా అయిదోసారి శౌర్య పురస్కారానికి ఎంపికై రికార్డు సృష్టించాడు. నక్సలైట్ల వ్యతిరేక పోరాటంలో పాల్గొనడం ద్వారా అత్యధిక శౌర్యపతకాలు పొందిన అధికారి మిశ్రా ఒక్కరే. నాలుగుసార్లు ఆయన నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి నిలిచారు.         » రాష్ట్ర పోలీసు విభాగంలో 26 మందికి భారత పోలీసు పతకాలు (ఐపీఎం), అయిదుగురు అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం) లభించాయి.
ఆగస్టు - 15
¤ 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.         » ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీ లోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు         » గతేడాది వృద్ధిరేటు 5 శాతానికి పడిపోవడంపై చాలా చర్చ జరుగుతోంది. మన దేశమొక్కటే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. ఈ మందగమనం ఇంకెంతకాలమో ఉండబోదని విశ్వసిస్తున్నా. పరిస్థితి చక్కదిద్దడానికి కష్టపడి పనిచేస్తున్నాం. గత తొమ్మిదేళ్లలో మన వృద్ధిరేటు సగటు 7.9 శాతం. మన సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది.         » రాబోయే నెలల్లో కొత్తగా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఇందులో 2 ఓడరేవులు, 8 విమానాశ్రాయాలు, పారిశ్రామిక కారిడార్లు, రైలు ప్రాజెక్టులు ఉన్నాయి.         » పేదరికాన్ని అంచనా వేయడం క్లిష్టమైన అంశం. పేదరికాన్ని నిర్వచించడంలో భిన్నమైన అభిప్రాయలున్నాయి. ఏ నిర్వచినమిచ్చినా పేదరికం తగ్గుదల 2004 తర్వాత గణనీయంగా పెరిగిందనే విషయాన్ని ఖండించలేం.         » మధ్యాహ్న భోజన పథకాన్ని సంస్కరిస్తాం. మన పిల్లలకు అందించే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉన్నంతమాత్రాన సరిపోదు, పరిశుభ్రంగా వండాలి. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలు చేపడతాం.         » వ్యవసాయంలో వేగవంతమైన అభివృద్ధి సాధించకుండా మన గ్రామాలను సుసంపన్నం చేయలేం. మునుపెన్నడూ లేనంతగా గత తొమ్మిదేళ్లలో వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచాం. ఇప్పుడు మన గ్రామాల్లో ఆర్థిక సుసంపన్నత పెరిగినట్లు స్పష్టంగా కనపడుతోంది.         » నైపుణ్య అభివృద్ధి విషయంలో తొలుత ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోయాం. ఇప్పుడు ఇది వేగవంతమయింది. కొద్ది నెలల క్రితమే జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశాం. మరో కొత్త పథకాన్ని ఏర్పాటు చేస్తాం. కొత్త నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి ఈ పథకం కింద రూ.10 వేలు అందిస్తాం. రాబోయే 12 నెలల్లో ఈ పథకం కింద దాదాపు 10 లక్షల మంది యువత లబ్ధి పొందుతుంది.         » స్వాతంత్య్రం సిద్ధించిన దగ్గర్నుంచి ప్రతి పదేళ్లకూ ముఖ్యమైన మార్పుల్ని చవిచూశాం. 1960ల్లో ప్రధాని నెహ్రూ కొత్త పరిశ్రమలను, కర్మాగారాలను నెలకొల్పారు. కొత్త సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. కొత్త విశ్వవిద్యాలయాలను నెలకొల్పారు. దేశాన్ని ఆధునికత వైపు మళ్లించే విధంగా ఆయన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేశారు. 1970ల్లో ఇందిర హయాంలో అంతరిక్షంలో మన తొలి ఉపగ్రహాన్ని ప్రారంభించాం. అప్పుడే హరిత విప్లవంతో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. ఆ తర్వాత దశాబ్దంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తృతికి రాజీవ్‌గాంధీ పునాది వేశారు. పంచాయితీరాజ్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. 1991లో పి.వి.నరసింహారావు హయాంలో పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నాం. అప్పుడు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత దశాబ్దంలోనూ ముఖ్యమైన మార్పులు జరిగాయి. మునుపెన్నడూ లేనంతగా ఆర్థికవృద్ధి సాధించాం. ప్రజాస్వామ్య శక్తులు బలపడ్డాయి. మొట్టమొదటిసారి సమాజంలోని చాలా వర్గాలు అభివృద్ధి ప్రధాన స్రవంతిలో భాగస్వాములయ్యాయి. సామాన్యులకు కొత్త హక్కులు కల్పించాం. ఫలితంగా వారికి సామాజిక, ఆర్థిక సాధికారత ఏర్పడింది. గత తొమ్మిదేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో మంచి పురోగతి సాధించాం.ఎర్రకోటపై ప్రధాని 'దశ'కంప్రధాని మన్మోహన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అరుదైన రికార్డు సృష్టించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 10 సార్లు మువ్వన్నెల జెండాను ఎగరేసిన నెహ్రూ, గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఘనత సాధించారు. తొలిసారి 2004 ఆగస్టు 15న మన్మోహన్ ఎర్రకోటపై జెండా పండుగను నిర్వహించారు. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర మాత్రమే ఇప్పటి వరకూ ఎర్రకోటపై 10 సార్లు వరుసగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అత్యధికంగా నెహ్రూ 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా, ఇందిర 16 సార్లు ఆవిష్కరించారు. 1966 నుంచి 1977 మధ్యకాలంలో వరుసగా 11 సార్లు ఇందిర జాతీయ పతాకావిష్కరణ గావించారు.         » స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా సంప్రదాయంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే తేనీటి విందు (ఎట్‌హోం) కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు.         » ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, యుపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతి పక్షనేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, సీనియర్ భాజపా నేత అద్వానీ, కేంద్ర మంత్రులు, వివిధ దేశాల రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.         » సబ్‌మెరైన్ సింధురక్షక్ ప్రమాదం కారణంగా నావికాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డి.కె.జోషి హాజరు కాలేదు. సైనికాధిపతి జనరల్ బిక్రంసింగ్, వైమానిక దళాధిపతి ఎన్.ఎ.కె. బ్రౌన్ హాజరయ్యారు.¤ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు తీర్చేలా నీటి సరఫరా పరిమాణాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.         » 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ఒక వ్యక్తికి 55 లీటర్ల నీటిని అందజేయాల్సి ఉంటుందని కేంద్ర గ్రామీణ నీటి సరఫరా శాఖ పేర్కొంది. ఇప్పటివరకు ఒక్కో వ్యక్తికి రోజుకి 40 లీటర్ల చొప్పున సరఫరా చేయాలనేది లక్ష్యం కాగా, దీన్ని 55 లీటర్లకు పెంచారు.         » నీటి సరఫరాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నడుమ ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టారు.¤ టెలివిజన్ పరిశ్రమ స్వయం నియంత్రణ సంస్థ అయిన ప్రసారాంశాల ఫిర్యాదుల మండలి (బీసీసీసీ - బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ కంప్త్లెంట్స్ కౌన్సిల్) తొలిసారిగా రెండు ఛానళ్లకు జరిమానా విధించింది. అభ్యంతరకర బిగ్ సీబీఎస్ లవ్ ఛానెల్‌కు రూ.10 లక్షలు, బిగ్ సీబీఎస్ స్పార్క్ ఛానెల్‌కు రూ.2 లక్షలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.¤ ప్రణాళికా రహితంగా గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నందువల్లే వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఏర్పడుతోందని పార్లమెంట్ స్థాయీసంఘం అభిప్రాయపడింది.         » సుమిత్ర మహాజన్ నేతృత్వంలోని ఈ స్థాయీసంఘం ఉపాధి హామీపథకంపై అధ్యయనం చేసి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గ్రామీణ ఆర్థిక రంగానికి వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిదని, వ్యవసాయరంగంలో కూలీల సమస్యను ఏమాత్రం విస్మరించలేమని స్థాయీసంఘం తెలిపింది.
ఆగస్టు - 16
¤ బీహార్‌లో మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం వికటించి 22 మంది విద్యార్థులు చనిపోయిన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా ఏం చేస్తున్నారో తెలపాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించింది.¤ 14 ఏళ్ల తర్వాత కార్గిల్ సెక్టార్‌లోనూ పాకిస్థాన్ సేనలు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు తెగబడ్డాయి. కార్గిల్ సెక్టార్‌లోని ద్రాస్, కక్సార్ ప్రాంతాల్లోని
భారత శిబిరాలపై పాక్ సేనలు కాల్పులు జరిపారు. ఈ దాడిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.
         » 1999లో కార్గిల్ యుద్ధం తరువాత ఇప్పటివరకూ ఆ ప్రాంతాన్ని తొంగి చూడటానికి కూడా పాక్‌సైన్యం సాహసించలేదు. తాజాగా దాడికి పాల్పడ్డాయి.
ఆగస్టు - 17
¤ ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా ముద్రిత రూపంలో చూసుకునేందుకు ఉపయోగపడే వెరిఫైయబుల్ ఆడిట్ ట్రయల్ సిస్టం (వీఏటీఎస్) దేశంలోనే తొలిసారిగా వచ్చే నెలలో నాగాలాండ్‌లో అమలు కానుంది.         » నాగాలాండ్‌లోని నాక్సెన్ (ఎస్టీ రిజర్డ్వ్) నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో దీనికి శ్రీకారం చుడతామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.         » ఈవీఎం విధానంపై ఓటర్లలో ఏర్పడే సందేహాలను నివారించేందుకు భాజపా నేత ఎల్‌కే అద్వానీ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఇతర పార్టీ నేతల సూచనల మేరకు ఎన్నికల సంఘం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో సవరణలు చేసింది.¤ 'రిజర్వ్ బ్యాంక్ చరిత్ర - పూర్వాపరాలు' (ఆర్‌బీఐ హిస్టరీ - లుకింగ్ బ్యాక్ అండ్ లుకింగ్ ఎహెడ్) పేరిట ప్రచురించిన ఆర్‌బీఐ చరిత్ర నాలుగో భాగాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్ న్యూఢిల్లీలోని తన నివాసంలో విడుదల చేశారు.         » భారత అభివృద్ధి చరిత్రే ఆర్‌బీఐ చరిత్ర అని, స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ద్రవ్య, రుణ విధానాలను ఉన్నతంగా మలచడంలో ఆర్‌బీఐ కీలకపాత్ర వహించి దేశానికే గర్వకారణంగా నిలిచిందని ప్రధాని కొనియాడారు.¤ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించి, పిన్నవయసులోనే ఉరికంబం ఎక్కిన యోధుడు భగత్‌సింగ్ అమరవీరుడు కాదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.         » దేశమాత దాస్య శృంఖలాలు తెంచడంలో ప్రాణత్యాగం చేసిన ఆ వీరుణ్ని ప్రభుత్వ రికార్డుల ప్రకారం అమరుడుగా గుర్తించలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.         » భగత్‌సింగ్‌ను, ఆయన సహచరులైన రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఎప్పుడు అమరులుగా ప్రకటించారో వెల్లడించాలని భగత్‌సింగ్ సమీప బంధువు యాదవేంద్రసింగ్ ఇటీవల హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులో కోరారు. 'భగత్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను అమరవీరులుగా ప్రకటించినట్లు చెప్పే రికార్డులేవీ మా శాఖ వద్ద లేవు' అని కేంద్ర హోంశాఖ యాదవేంద్రసింగ్‌కు సమాధానమిచ్చింది.         » స్వాతంత్రోద్యమంలో అసువులుబాసిన వారిని అమరులుగా ప్రకటించే విధానమేదీ లేదని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. రక్షణశాఖ సైనికులకు మాత్రమే ఆ హోదా ఇస్తుందన్నాయి.         » భగత్‌సింగ్ అమరత్వానికి రికార్డులు ఆధారం కాదని ప్రధాని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని వివాదం చేయవద్దని కోరారు. 'భగత్ స్వాతంత్య్రమనే మహత్తర లక్ష్యం కోసం అమరుడయ్యారు. ఆయన అమరత్వానికి అధికార రికార్డులు ఆధారం కాదు. భగత్‌సింగ్ జాతికి గర్వకారణం. ఆయనకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది' అని ప్రధాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆగస్టు - 18
¤ ఉన్నత విద్యాసంస్థలకు అధికారిక గుర్తింపు (అక్రెడిటేషన్)ను తప్పనిసరి చేస్తూ తీసుకురాదలచిన 'జాతీయ అధీకృత గుర్తింపు నియంత్రణ ప్రాధికార బిల్లు - 2010' కి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మార్పులు చేసింది.         » ఈ బిల్లు ప్రస్తుతం లోక్‌సభ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లు సభామోదం పొందితే 'ఉన్నత విద్యాసంస్థల జాతీయ అధీకృత గుర్తింపు నియంత్రణ ప్రాధికార సంస్థ' ఏర్పాటవుతుంది.¤ ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి ఆమ్గే జైపూర్‌లో ప్రపంచలోనే అత్యంత పెద్ద పుస్తకాన్ని ఆవిష్కరించారు.         » జైన్ ముని శ్రీ తరుణ్ సాగర్ 'కాద్వేప్రవచన్' పేరుతో రాసిన ఈ పుస్తకం సైజు 30 X 24 అడుగులు (30 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పు) బరువు 2000 కిలోలు.         » ఈ పుస్తకం తయారీకి 1500 కిలోల ఇనుము, 100 లీటర్ల రంగులను ఉపయోగించారు.
¤ కాళ్లులేని వికలాంగులకు నడకను ప్రసాదించిన జైపూర్ కృత్రిమ పాదం మరో అరుదైన ఘనతను సాధించింది. అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో జైపూర్ ఫుట్ 'కేస్ స్టడీ'గా ఎంపికైంది. దీన్ని బిజినెస్, హెల్త్‌కేర్ మోడల్‌గా స్కూల్‌లో సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనున్నారు.
  జైపూర్ కృత్రిమ పాదం
         » హార్వర్డ్ కేస్ స్టడీలో కృత్రిమ పాదాన్ని తయారు చేసే విధానం, అందులో వాడే సాంకేతికత, ఆర్థిక అంశాలు, మన్నిక, నిర్వహణ తీరు ఇమిడి ఉంటాయి.         » భారత సంతతికి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీకాంత్ దతార్ చేసిన పరిశోధన ఆధారంగా ఈ కేస్ స్టడీ రూపొందింది.         » భగవాన్ మహావీర్ వికాలాంగ సహాయతా సమితి (బీఎంవీఎస్ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ జైపూర్ ఫుట్‌ను తయారు చేసి పంపిణీ చేస్తోంది. ఒక్కో కృత్రిమ పాదానికి రూ.2,500 ఖర్చు చేస్తోంది. ఏటా దాదాపు 25వేల మందికి ఈ కృత్రిమ పాదాన్ని అమర్చడం విశేషం.¤ సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటూ, నిఘాను పెంచేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నేపాల్, భూటాన్ ప్రాంతాలతో సహా సరిహద్దుల్లోని అతి ముఖ్యమైన ప్రాంతాల్లో 23 సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఆగస్టు - 19
¤ క్రిమినల్ కేసులో అభియోగాలు (ఛార్జిషీటు) నమోదైన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం తీసుకురావాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.¤ నిర్ణీత గడువులోగా అవినీతి కేసుల విచారణను పూర్తిచేయడం తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.         » అవినీతి నిరోధక సవరణ బిల్లు- 2013ను సిబ్బంది శాఖ సహాయమంత్రి నారాయణస్వామి రాజ్యసభలో ప్రవేశపెట్టారు.         » ఈ బిల్లు ప్రకారం మంత్రులు సహా ప్రభుత్వ అధికారులపై తగిన కోర్టులో ఫిర్యాదు చేసినట్లయితే, ప్రభుత్వం వారి విచారణకు అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. అవినీతి ఆరోపణలున్న ప్రభుత్వాధికారులపై విచారణకు అనుమతించే విషయాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత యంత్రాంగం మూడు నెలల్లో తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అటార్నీ జనరల్ లేదా అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదింపుల తర్వాత ఈ గడువును గరిష్ఠంగా మరో నెలరోజులు పొడిగించవచ్చు. అవినీతి కేసులకు సంబంధించి ప్రభుత్వ అధికారులపై విచారణకు సంబంధిత శాఖకు చెందిన మంత్రి అనుమతిస్తారు.¤ సినిమా పాటలపై ఇన్నాళ్లూ నిర్మాతలకు, సంగీత దర్శకులకు, పాటల రచయితలకు మాత్రమే దక్కిన రాయల్టీ ఇకపై గాయనీ గాయకులకూ దక్కాలని కోరుతూ 'ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్' (ఇస్రా) పేరిట ప్రఖ్యాత గాయనీ గాయకులు ఒక సంస్థను ఏర్పాటు చేశారు.         » చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.

లతా మంగేష్కర్
         » ఈ సంస్థకు లతా మంగేష్కర్ నేతృత్వం వహిస్తారు. దిగ్గజ గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.జె.ఏసుదాసు, పి.సుశీల, వాణీ జయరాం, హరిహరన్, మనో, చిత్ర తదితరులు ప్రాతినిధ్యం వహిస్తారు.
         » గతేడాది కేంద్రం జారీ చేసిన కాపీరైట్ చట్టం ప్రకారం తమకూ రాయల్టీకావాలని గాయనీ గాయకులు డిమాండ్ చేస్తున్నారు.
         » ఇస్రాలో సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే రాయల్టీ దక్కుతుంది.
ఆగస్టు - 20
¤ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్థానంలో సివిల్ ఏవియేషన్ అథారిటీ ఏర్పాటు చేయడం ముఖ్యాంశంగా రూపొందించిన 'ద సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్లు - 2013' ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
¤ ఆహార భద్రత పథకాన్ని యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలో ప్రారంభించారు.         » ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, కేంద్ర ఆహార శాఖ మంత్రి థామస్‌లు పాల్గొన్నారు.
         » మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి.
         » ఆహారభద్రతా పథకం తొలి కార్డును సోనియాగాంధీ ఢిల్లీకి చెందిన పరమేశ్వరీ దేవి అనే వృద్ధురాలికి అందించారు. మరి కొందరు లబ్ధిదారులకు ఆహార ధాన్యాల ప్యాకెట్లను అందజేశారు.         » పార్లమెంటులో ఆహార భద్రత బిల్లు ఇంకా గట్టెక్కకుండానే ఈ రాష్ట్రాల్లో పథకాన్ని ప్రారంభించడం గమనార్హం.         » 80 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఏటా రూ.1.25 లక్షల కోట్లతో 6.2 కోట్ల టన్నుల ధాన్యం, గోధుమలు, తృణ ధాన్యాలు సబ్సిడీపై అందజేయనున్నారు.¤ ప్రభుత్వోద్యోగి మరణం, బాధిత కుటుంబానికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోరే హక్కును ఇవ్వలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.         » అంతేకాకుండా కారుణ్య నియామకం కోరే సదరు వ్యక్తి ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కలిగి ఉండాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.         » న్యాయమూర్తులు బి.ఎస్.చౌహాన్, ఎస్.ఎ. బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.         » బాధిత కుటుంబం ఆర్థిక స్థితిగతులన్నీ పరిశీలించిన తర్వాత యజమాని మరణంతో ఏర్పడిన సంక్షోభం నుంచి ఆ కుటుంబం బయటపడలేదని భావించినప్పుడు మాత్రమే అర్హుడైన కుటుంబ సభ్యుడికి ఉద్యోగావకాశం కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.¤ ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను మరింత పెంచుతూ ఆర్టీఐ (సమాచార హక్కు) దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించే వేదికను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.         » www.rtionline.gov.in  వెబ్‌సైట్‌ను న్యూఢిల్లీలో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల, పింఛన్ల శాఖ సహాయ మంత్రి వి.నారాయణ స్వామి ప్రారంభించారు.         » ఈ వెబ్‌సైట్ పరిధిలో ప్రస్తుతం 82 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా దీన్ని విస్తరించనున్నామనీ మంత్రి ప్రకటించారు.         » ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేవారు నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, దరఖాస్తులో రాసే విషయం 3,000 పదాలకు మించకూడదని, ఆ పరిమితి దాటితే అదనపు పత్రాన్ని అటాచ్‌మెంట్ రూపంలో సమర్పించాలని నిబంధనలు పెట్టారు.
ఆగస్టు - 21
¤ 'క్రిమినల్ లా' కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధానమైన సంస్కరణను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నం నేరం. దీన్ని ఇక నేరచర్యగా పరిగణించకుండా ఉండేలా నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.         » ఇందులో భాగంగా బలవన్మరణ యత్నాన్ని నేర చర్యగా పరిగణించరాదనే 'మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లు-2013' ను ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.         » 'మానసిక ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండటమనేది అందరి హక్కు' అని కూడా బిల్లు పేర్కొంటోంది. బలవన్మరణ యత్నాన్ని మనిషి మానసిక ఆరోగ్య పరిస్థితికి ముడి పెడుతోంది. ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తే ఆ సమయంలో వారు మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నట్లుగా భావించాలని చెబుతోంది. అలాంటి సమస్య ఏదీ లేదని రుజువైతే తప్ప వారి పరిస్థితిని అలాగే పరిగణించాలని పేర్కొంటోంది. ఆత్మహత్య యత్నాన్ని మానసిక అనారోగ్యంగా భావించినప్పుడు, అందుకు పాల్పడిన వ్యక్తిని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 309 కింద శిక్షించడానికి వీల్లేదని చెబుతోంది.         » ఆత్మహత్యకు యత్నించే వ్యక్తుల చికిత్సకు బిల్లులో ప్రత్యేకంగా నిబంధన ఉంది. మానసిక ఆరోగ్య సమస్యలున్న వారికి చికిత్స అందించాలని, ఆ సమయంలో వారి హక్కులను కాపాడాలని ఇది పేర్కొంటోంది.         » మానసిక ఆరోగ్య చట్టం - 1987 స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.¤ చేతబడులు, మూఢాచారాలు, అమానవీయ మత సంప్రదాయాలను అరికట్టేందుకు అత్యవసరాదేశం (ఆర్డినెన్స్) జారీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.         » ప్రముఖ హేతువాద నాయకుడు, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు నరేంద్ర థబోల్కర్ ఆగస్టు 20న హత్యకు గురైన నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది¤ వార్షిక అమర్‌నాథ్ యాత్ర శ్రావణ పూర్ణిమతో ముగిసింది. శివుడి పవిత్ర చామరం 'చడీ ముబారక్' గుహక్షేత్రన్ని చేరడంతో 55 రోజుల పాటు కొనసాగిన యాత్ర పూర్తయింది.
ఆగస్టు - 22
¤ సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు కీలకమైన తీర్పులను వ్యతిరేకించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశాలుగా ఉన్న అత్యంత కీలకమైన రెండు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.         » జైల్లో ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతివ్వడం అందులో మొదటిది. అప్పీలు పెండింగులో ఉన్నంత వరకూ శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేల సభ్యత్వం యథాతథంగా ఉంచడం రెండోది. ఈ రెండు అంశాలపై ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ రెండు ప్రత్యేక బిల్లులు రూపొందించి పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు.         » జైల్లో ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని, శిక్షపడిన ప్రజాప్రతినిధుల సభ్యత్వం రద్దవుతుందని 2013 జులై 10న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రెండు తీర్పులను దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.         » సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దాని స్థానంలో జుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవస్థ నుంచి వ్యతిరేకత వచ్చినా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.         » ఈ బిల్లు ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలతో పాటు, 24 హైకోర్టుల జడ్జిల నియామకాల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కమిషన్‌కు తెలియజేస్తుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల అభిప్రాయాలను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది.         » ప్రతిపాదిత బిల్లు కింద జడ్జిల నియామకాలు, బదిలీలకు ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) సారథ్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.
ఆగస్టు - 23
¤ ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఓ ఇంగ్లిష్ మ్యాగజైన్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న యువతి (23 సంవత్సరాలు)పై ముంబయిలోని మహాలక్ష్మి ప్రాంతంలోని శక్తిమిల్లు కాంపౌండ్‌లో ఆగస్టు 22న అయిదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
¤ 'ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దు' అంటూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి సభలో నినదిస్తున్న 12 మంది సీమాంధ్ర ఎంపీలను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సస్పెండ్ చేశారు.         » సస్పెండ్ అయిన వారిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన 8 మంది, తెదేపాకు చెందిన నలుగురు ఉన్నారు.         » ఈ 12 మంది ఎంపీలకూ అయిదు రోజుల పాటు 'సభా బహిష్కార దండన' పడింది.         » ప్రభుత్వ తీర్మానంతో, సభ్యుల సహకారంతో సంబంధం లేకుండా స్పీకర్ మీరాకుమార్ '374 ఏ' నిబంధన ప్రకారం 'ఆటోమేటిక్ సస్పెన్షన్' అస్త్రాన్ని ప్రయోగించారు. 'సభ నడవాలంటే చర్యలు తప్పవు' అని ముందే అన్ని పార్టీల సభాపక్ష నేతలకు తెలిపి, వారి అంగీకారంతోనే స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు.         » సభ్యులపై చర్యలకు సంబంధించి 374 ఏ మరింత ప్రత్యేకమైంది. ఒక సభ్యుడు లేదా కొందరు సభ్యులు అదేపనిగా, నిరంతరాయంగా సభాకార్యకలాపాలకు అంతరాయం కల్పించడం, నినాదాలు చేయడం, సభమధ్యలోకి దూసుకురావడం వంటివి చేస్తే 374 ఏ నిబంధన కింద స్పీకర్ ఆ సభ్యుల పేర్లు చదివి వినిపిస్తారు. అంతే.. వారిపై ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ వేటు పడుతుంది. అయిదురోజులు లేదా సమావేశాలు ఎన్నిరోజులు మిగిలి ఉంటే అన్ని రోజులు (ఏవి తక్కువ అయితే అవి) సస్పెన్షన్ వర్తిస్తుంది. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని భావిస్తే సభలో తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది.         » 374 ఏ(2) నిబంధన కింద చర్యలు తీసుకుంటే సంబంధిత సభ్యులు సభ ఆవరణ నుంచి కూడా వెళ్లిపోవలసిందే.         » రూల్ 373 ప్రకారం సభలో ఒక సభ్యుడు లేదా సభ్యులు తీవ్రస్థాయి గందరగోళం సృష్టిస్తున్నట్లు స్పీకర్ అభిప్రాయపడితే సభ నుంచి బయటికి వెళ్లిపోవల్సిందిగా వారిని ఆదేశించవచ్చు. ఇది సస్పెన్షన్ కాదు. సభా బహిష్కరణ.సస్పెన్షన్‌కు గురైన సీమాంధ్ర ఎంపీలు¤ కాంగ్రెస్ నుంచి: లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఎం.శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి, జి.వి.హర్షకుమార్, ఉండవల్లి అరుణ్‌కుమార్.¤ తెదేపా నుంచి: మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్.



No comments:

Post a Comment